17-10-2025 12:08:09 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు బాగా పనిచేస్తే హయ్యర్ రెఫరల్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుందని అన్నారు.
జిల్లాలో ఉన్న 7 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జూలైలో 47 నుంచి సెప్టెంబర్ 74 కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదని కలెక్టర్ అన్నారు. 10 మంది గైనకాలజిస్ట్ స్టాఫ్ ఉన్నప్పటికీ కేవలం 74 ప్రసవాలు మాత్రమే జరగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ నమోదు కూడా మన దగ్గర తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి పరిధిలోని ఆశా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ గర్భిణీ మహిళలను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వసతులను వినియోగించుకుంటూ ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. వైద్య పరీక్షలకు బయటకు పంపుతున్నారు అనే మాట ప్రజలలో బాగా వినిపిస్తుందని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వైద్య విధాన పరిషత్ సంబంధించి ప్రతి రిపోర్ట్ ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, పాలేరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి రమేష్, సూపరింటెండెంట్లు, సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.