6 March, 2026 | 2:39 PM

మరింత ప్రియం కానున్న యూకే వీసా

27-03-2025 12:00 AM

ఏప్రిల్ 9వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి

భారతీయులపైనే అధిక భారం!

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లాలనుకుంటున్న వారికి ఒక చేదువార్త. త్వరలో యూకే వీసా ధరలు మరింత ప్రియం కానున్నాయి. యూకేకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు, పర్యాటకులకు, వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు వీసా ఫీజులు పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వీసా ధరలను ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే వీసా ధరల పెంపుతో భారతీయులపై అధిక భారం పడే అవకాశముంది.

బ్రిటన్‌లో అడుగుపెట్టాలంటే భారతీయులకు వీసా తప్పనిసరి. ప్రస్తుతం ఆరు నెలల గడువు గల వీసాకు 115 పౌండ్ల ఫీజు ఉంటే దాన్ని 10 శాతం పెంచడంతో వీసా ఫీజు 127 పౌండ్లకు చేరుకుంది. అదే సమయంలో రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెరిగింది. విద్యార్థి వీసాలపైనా పెరుగుదల ప్రభావం కనిపించనుంది. ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. త్వరలో అది 524 పౌండ్లకు చేరనుంది.