ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆభరణాలు, నగదు చోరీ
హైదరాబాద్: నగరంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే చోరీకి పాల్పడ్డారు. గాంధీ నగర్లోని బోయగూడలో(Bhoiguda) శుక్రవారం నాడు దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇంటి యజమాని మొహమ్మద్ సబీర్, అతని కుటుంబ సభ్యులు గురువారం ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించిన నివాసితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా గాంధీ నగర్ పోలీసులు(Gandhi Nagar Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ టీం సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.






