18-12-2025 02:09:08 AM
మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): సంఘటిత ఉద్యమం ద్వారానే మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధించవచ్చని రాజకీయ పార్టీల ప్రతినిధులు తీర్మానించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ రైల్వే మెగా ప్రాజెక్టు సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని, ప్రజా ఉద్యమం ద్వారానే పరిశ్రమ ఇతర ప్రాంతాలకు తరలకుండా అడ్డుకోవచ్చు అని చెప్పారు.
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మహబూబాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన మెగా మెయింటెనెన్స్ డిపోను ఇక్కడే ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బి ఎస్ పి, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, తెలుగుదేశం పార్టీల నాయకులు పాల్గొన్నారు.