23-09-2025 01:05:35 PM
కన్నుల పండువగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..
వరద ప్రవాహంతో మూలవిరాట్ అమ్మవారి దర్శనం నిలిపివేత..
గోకుల్ షెడ్ లో అంగరంగ వైభవంగా సాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు..
పాపన్నపేట (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం వనదుర్గామాతను గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) రూపంలో, గులాబీ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది.
దీంతో రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయిందేనని భక్తులు కాస్త చింతనకు లోనవుతున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు అన్నపూర్ణాదేవిగా వన దుర్గమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన బుధవారం వనదుర్గామాత అన్నపూర్ణా(చంద్ర ఘంటా) దేవి రూపం, నీలం రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.