01-09-2025 02:34:15 PM
బఫర్ జోన్లో భారీ భవంతుల నిర్మాణం..
రాజకీయ నాయకుల అధికారుల అండదండలే ఈ ముంపుకు కారణమా!!
కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని చుంచుపల్లి మండలం(Chunchupalle Mandal)లో గల విద్యానగర్ కాలనీ పంచాయతీలోని (చింతలచెరువు) సోమవారం కురిసిన భారీ వర్షానికి, వరద నీరు హైవేపై చేరి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, కార్మికులు, ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ వుంటారు. నేడు ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. దీనికి కారకులెవరు ఎవరివల్ల ఈ దుస్థితి ఏర్పడింది అని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఉన్న నాగేశ్వర టాకీస్ పరిసర ప్రాంతంలో ఉన్నటు వంటి చెరువు పూర్తిగా కబ్జా చేయబడి రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆ ప్రాంతంలో భవంతులను భారీగా నిర్మించటం, దీనికి స్థానిక పంచాయతీ అధికారులు వత్తాసు పలికి, బఫర్ జోన్, ఏజెన్సీ ప్రాంతం అని తెలిసి కూడా ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
స్థానికుల సమాచారం ప్రకారం, చెరువు ముందు భాగంలోని బఫర్ జోన్ పరిధిలో,బౌహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం వల్లే, ఈ వరద ముంపుకు ముఖ్యమైన కారణం అని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల నీరు రహదారిపై చేరి రవాణాకు ఆటంకం కలిగిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “కాసులకు కక్కుర్తి పడి అధికారులు విచ్చలవిడిగా బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వడం అత్యంత దారుణమని, రాజకీయ నాయకుల ఒత్తిడి కి తలోగ్గడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పరిష్కారం చూపకపోతే, భవిష్యత్తులో హైడ్రా కోసం మరో భారీ ఉద్యమం తప్పదని, వరద నీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో, మరింత ప్రమాదం వాటిళ్లే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.