మెదక్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఓటున్న ప్రతి పౌరుడు దాన్ని వినియోగించుకోవాలి. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదయ్యాక వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. కొన్ని అసాధారణ సం దర్భాలలో నేరుగా ఓటు వేసే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాలలో ఎన్నికల సంఘం మరో ఐదు విధాలుగా ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే సంబంధిత ఓటరు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరు విధాలుగా ఓటు వేయవచ్చు.
సాధారణ ఓటు..
18 ఏళ్లు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రాల్లో నేరుగా ఓటు వేయడాన్ని సాధారణ ఓటు అంటారు.
పోస్టల్ బ్యాలెట్...
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్ రోజున తమ స్వస్థలాలకు వెళ్లి ఓటేసే అవకాశం ఉండదు. ఇలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
సర్వీస్ ఓటు..
సైనికులు, పారామిలిటరీ దళాల్లోని ఉద్యోగులు, సిబ్బంది విధుల నిర్వహణలో భాగంగా దూర ప్రాంతాల్లో ఉంటారు. వీరు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా సర్వీస్ ఓట్ల విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రాక్సీ ఓటు..
ప్రాక్సీ ఓటు అంటే తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయడం. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఎతమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు.
టెండరు ఓటు..
జాబితాలో పేరుండి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేసరికి తమ ఓటును వేరొకరు వేశారని తెలిశాఖ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నవారికి టెండర్ ఓటు ఇస్తారు. అయితే తాను అంతకుముందు ఓటు వేయలేదని ఆ ఓటరు పోలింగ్ సిబ్బంది వద్ద నిరూపించుకోవాలి.
ఇంటి నుంచి ఓటు..
వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించారు. 85 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులకు, 40 శాతం పైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం సీఈసీ కల్పించింది.