18-08-2025 02:06:09 AM
పాట్నా, ఆగస్టు 17: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్ర తొలి రోజు పూర్తయింది. ఆదివారం బీహార్లోని ససారంలో ఈ యాత్ర ప్రారంభమై ఔరంగాబాద్ వరకు కొనసాగింది. ఆదివారం రాత్రి బస కోసం ఔరంగాబాద్లో యాత్రను నిలిపివేశారు. నేడు ఔరంగాబాద్ నుంచి యాత్ర మొదలవనుంది. యాత్ర సందర్భంగా తేజస్వీ యాదవ్ జీపు నడుపగా రాహుల్ గాంధీ అందులో నిల్చొని అందరికీ అభివాదం చేశారు.
ఎమర్జెన్సీ కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఓట్ల చోరీ జరుగుతోంది. మహారాష్ట్రలో చూసుకుంటే అన్ని సంస్థల ఒపీనియన్ పోల్స్ ఇండియా కూటమి అధికారం ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది.
కోటి మంది కొత్త ఓటర్ల ఓట్లను బీజేపీ పొందింది. బీహార్లో మాత్రం ఓట్ల చోరీ జరగనివ్వం’ అని తెలిపారు. ఈ యాత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాదని.. ఓటర్ల హక్కులను కాపాడేందుకే అని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆర్జేడీ చీఫ్ లాలూ, ఇతర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.