07-08-2025 01:17:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా, బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా బుధవారం వాక్థాన్ సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతంలో నిర్వహించారు. ‘వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఏ స్ముల్’ పేరుతో నిర్వహించారు. ‘అవయవాన్ని కాపాడండి, జీవితాన్ని నిలబెట్టండి.. జీవితాన్ని నిలబెట్టండి..
అంప్యూటేషన్లకు చెబుతాం వద్దని’ అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్క్యులర్ వ్యాధులకు సరైన సమయంలో సరైన చికిత్స అందించకపోతే అంప్యూటేషన్ (చేతులు లేదా కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి)కు దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ ఆర్టరీ, వేన్, డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డాక్టర్ బీ నిషాన్రెడ్డి మాట్లాడుతూ..
భారతదేశంలో వాస్క్యులర్ వ్యాధుల భయంకర పరిస్థితిపై వివరించారు. ‘ఏటా భారతదేశంలో సుమారు 25,000 మంది వాస్క్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్లను కోల్పోతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగుల్లో ఇది అధికంగా కనిపిస్తుంది. అయితే, వీటిని త్వరితంగా గుర్తించి, సరైన వైద్య చర్యలు తీసుకుంటే, 80 శాతం వరకు అంప్యూటేషన్లను నివారించవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా మేం ప్రజలకు ఈ నివారించదగ్గ సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఈ వాక్థాన్ను నిర్వహించాం’ అని పేర్కొన్నారు. వాక్థన్ను ప్రముఖ సినీనటుడు రాజీవ్ కనకాల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన శరీరంలో ముఖ్యమైన కాళ్లు చేతుల్లో తలెత్తే వాస్క్యులర్ సమస్య కారణంగా ఒక్కోసారి ఆ అవయవాలను పూర్తిగా తీసేయాల్సి వచ్చే పరిస్థితులకు కూడా దారితీస్తుందని అన్నారు. ఇటీవల తమ బంధువుల్లో ఒకరికి ఈ సమస్య ఎదురైందన్నారు.
ఇలాంటి సమస్యల తలెత్తకుండా ప్రతిఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండేందుకు వ్యాయామం, వాక్ చేయాలని తెలిపారు. సీనియర్ మెడికల్ జర్నలిస్ట్, యాంకర్ మాధవి సిద్ధం మాట్లాడుతూ వాస్క్యులర్ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ వాక్లో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. వాక్థన్లో డాక్టర్ సీహెచ్ గోపాల్, డాక్టర్ నివేదిత, డాక్టర్ నవ వికాస్, హాస్పిటల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.