10-10-2025 01:31:50 AM
జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ రంగం బలోపేతంలో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ్ల అన్నారు. రాష్ర్టంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని జర్మనీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం వివరించారు. గురువారం సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.
రాష్ర్ట ప్రభుత్వం సోలార్ రంగం పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ర్టంలోని వ్యవసాయ పంపుసెట్లతోపాటు గృహ జ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించాలనే ఆలో చనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రైతులు, గృహ జ్యోతి వినియోగదారులకు ప్రతినెలా ఖచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఆలోచన ఉందన్నారు.
జర్మన్ ప్రతినిధులు సూచించిన సోలార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ర్టంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు భట్టి విక్రమార్క ఆదేశించారు.