ఫుడ్ సేఫ్టీపై కఠినంగా ఉంటున్నాం
- 6వేల తనిఖీల్లో రూ.60 లక్షల జరిమానా విధించాం
- జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీంపై ప్రత్యేక దృష్టి
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, డిసెంబర్2 (విజయక్రాంతి): ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని.. 6వేల తనిఖీలు నిర్వహించి రూ.60 లక్షల జరిమానా విధించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
త్వరలో ప్రజలందరికీ హెల్త్కార్డులు జారీచేసేలా కసరత్తు చేస్తున్నామ న్నారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ.. ప్రతి నెలా రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్పాట్స్ వద్ద అంబులెన్సులు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. 15 రోజుల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఓ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికిల్ను అందుబాటులోకి తీసుకొస్తామని.. 4 ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
జనాభాకు తగ్గట్లుగా పీహెచ్సీలు, సబ్ సెంటర్లు అనే పాత పద్ధతికి స్వస్తి పలికి దూరాన్ని బట్టి ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలిపారు. నగరంలో నిర్మిస్తున్న 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏడాదిలోగా పూర్తవుతాయని తెలిపారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.






