10-05-2025 12:44:18 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 9 ( విజయ క్రాంతి) ఫాసిజం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో సుదర్శన్రావు మాట్లాడుతూ ఫాసిజం సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు.
హిట్లర్ ఫాసిజాన్ని 1945 మే 9 సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం ఓడిరచిందన్నారు. ఫాసిజం మానవాళికి అత్యంత ప్రమాదకరమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్ కి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పూర్తి చేయకుండానే ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో గోదావరి జలాలు అందించామని మంత్రులు ప్రచారం చేస్తున్నారని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు మరో రూ19 వేల కోట్ల మేరకు అవసరం అని ప్రభుత్వం ప్రకటించి, బడ్జెట్లో కేవలం రూ600 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఖమ్మం జిల్లాలో రుణమాఫీ నలభై శాతం రైతులకు చేయలేదన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన ధాన్యం, పండ్ల తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఏలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించాలని కోరారు.
మే 19న దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సభలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బొంతు రాంబాబు, వై.విక్రమ్, భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్, ఎర్రా శ్రీనివాసరావుతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.