07-09-2025 12:38:51 AM
స్టేషన్ ఘనాపూర్ (మహబూబాబాద్), సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): బదిలీ అయి న హెడ్మాష్టర్ను తిరిగి తమ పాఠశాలకు నియమించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం శివునిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. చక్కగా విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ యోగక్షేమాలను పట్టించుకొని తల్లిదండ్రులకు మించి ప్రేమగా చూసుకునే హెడ్మా స్టర్పై కొందరు లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేశారని విద్యార్థినులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బదిలీ చేసిన హెడ్మాస్ట ర్ని తిరిగి తమ పాఠశాలకు రప్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థినులు ఆహార పానీయాలు తీసుకోకుండా నినాదా లు చేస్తూ దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వినయ్ కుమార్ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడా రు.
మీరు చెబితే మా సమస్య పరిష్కరించబడదని, కలెక్టర్ సార్ మాకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని విద్యార్థినులు పట్టుపట్టారు. దీంతో ఆర్డీవో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీతో విద్యార్థులు దీక్ష విరమించారు.