23-07-2025 12:33:07 AM
నిజామాబాద్ జులై 22:(విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లో గల బిసిటియు ఆఫీస్ లో బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంగళవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి బీసీ లకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని,
ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిసి ల పోరాట ఫలితం, బిసి ల విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఫలితమన్నారు. ఆగస్టు 7 న గోవాలో 10 వేల మంది బిసి ప్రతినిధులతో ఓబిసి మహా సభ నిర్వహిస్తున్నారని, దీనికి దేశం లోని అన్ని రాష్ట్రాల నుండి బిసి లు పెద్ద ఎత్తున పాల్గొంటారని, మన జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు సభకు హాజరవ్వాలన్నారు .
ఉపాధ్యాయులు పదవీ విరమణ చెందడం వలన అనేక గజిటెడ్ ఉపాధ్యాయ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నందున, వెంటనే ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. బిసి లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు యు. విజయ్ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.