12-06-2025 01:28:37 AM
పేదలకు గూడుతో పాటు పౌష్ఠికాహారం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: మంత్రి సీతక్క
ములుగు, జూన్ 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యమంటే రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యం అని, గత పాలకులు చేసిన అప్పులను తల తాకట్టు పెట్టయినా అప్పులను తీర్చుతూ సంక్షేమ ఫలాలను అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి సీతక్కతో కలిసి భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22వేల 500 కోట్ల రూపాయలతో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని, గతంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసిందని అన్నారు.
గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్లో నిర్మించి ఇస్తామని పేదలకు సాకులు చెప్పి 10 సంవత్సరాల కాలంలో కేవలం 93 వేల ఇండ్లకు టెండర్లను పిలిచి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందని విమర్శించారు. ములుగు నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా ఐటీడీఏ కు మరో 1500 ఇండ్లు మంజూరయ్యాయని, తాను మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ఉచితంగా ఇసుక కోసం కూపన్లను అందజేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మాజీ సీఎం పేదలకు డబల్ బెడ్ రూమ్లు అందిస్తామని మోసం చేశారని, నేడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడంతో దానిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దృష్పప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పేదవాడికి నీడని అందించడంతోపాటు కడుపునిండా తిండి తినడానికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇచ్చిన హామీలన్నిటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని వివరించారు. జిల్లాను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి నిధులు కేటాయించడం జరిగిందని,70 కోట్ల రూపాయలతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా 30 కోట్ల రూపాయలతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు.
ఇక్కడి ప్రాంతంలోని మహిళలకు ఇతర ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ పై శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, పేదల గూర్చి ఆలోచించే ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. అంతకుముందు గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఇద్దరు మంత్రులు సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు.
కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, కలెక్టర్ టి.ఎస్.దివాకర్, ఎస్పి శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఆర్డీవో వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.