16-10-2025 02:39:02 AM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, అక్టోబర్ 15 : ఎల్బీనగర్ లోని సింధూర్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. సింధూర్ ఎంక్లేవ్ కాలనీలోని యువేరా అపార్ట్మెంట్ లో బుధవారం స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డితో కలిసి మధుయాష్కీగౌడ్ మాట్లాడారు.
కాలనీ వాసులు పలు సమస్యలను వివరించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రైవేట్ టాక్సీవాళ్లు రోడ్ల పక్కనే వాహనాలు పార్కు చేస్తున్నారని, ఇదేమని అడిగితే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్కును అభివృద్ధి చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు.
అనంతర మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ... ఎల్బీనగర్ ప్రధాన జాతీయ రహదారి నుంచి సింధూర్ ఎంక్లేవ్ కు నేరుగా రోడ్డు కనెక్టివిటీ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. సర్వీస్ రోడ్డులో కాలనీకి వచ్చే దారిలో అడ్డగోలుగా పార్కింగ్ చేయకుండా పోలీసు అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు.
ట్రాఫిక్ రద్దీ తదితర సమస్యల పరిష్కారానికి రోజు నలుగురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కాలనీ నుంచి బయటికి డ్రైనేజీ కలిపే విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ, 200 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ..
ఎల్బీనగర్ నుంచి ఆందోల్ మైసమ్మ వరకు రూ. 650 కోట్లతో మెట్రో కం ఫ్లు ఓవర్, రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, నాయకులు భీమిడి రామకృష్ణారెడ్డి, అపార్ట్మెంట్ వాసులు నర్సిరెడ్డి, రాజేందర్ రెడ్డి, జానకి రామ్ రెడ్డి , రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.