16-07-2025 12:55:07 AM
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
లక్షేట్టిపేట, జూలై 15 : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళ వారం మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, తహశిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని అర్హులు మీ-సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని, వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందన్నారు.
దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. లక్షెట్టిపేట మండలంలో 1,538 నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు 2,084 మందికి అర్హత కల్పించి రేషన్ కార్డులో చేర్పించి సర్దుబాటు చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది విచారణ కొరకు వస్తారని, వివరాల సేకరణ అనంతరం అర్హులకు రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి రావచ్చని, ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలో గ్యాస్ రాయితీ జమ చేయడం జరుగుతుందని, అర్హత కలిగి రాయితీ పొందని వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, మాజీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.