01-05-2025 12:00:00 AM
స్టోర్లో బినామీలదే హవా!
సిద్దిపేట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా విద్యుత్ శాఖలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సాక్షాత్తు తప్పు చేసి దొరికిపోయిన ఉన్నతాధికారులు లైటుగా తీసుకుంటున్నారు. తమకు కావాల్సింది ముట్ట చెప్తే సరిపోద్దని, ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోమని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జిల్లా విద్యుత్ శాఖలో అక్రమార్కుల ఆగడాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి.
అంతేకాకుండా జిల్లా స్టోర్ లో బీనామీలా హవా యదేచ్చగా సాగుతుంది. ఒకే కాంట్రాక్టర్కు ఏడాది పరిధిలో సగానికి పైగా ఆర్డర్లను ఇవ్వడం... ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా ఎల్పిఓలు ఇస్తుండడంతో వారికి కావలసినవి వారికి దక్కుతున్నట్లుగా పలువురు మాట్లాడుకుంటున్నారు.
సదరు కాంట్రాక్టర్ సైతం ఏడీ స్థాయి అధికారి బినామీగా తెలుస్తుంది. అసలు జిల్లాలో ఏం జరుగుతుందో అని, జిల్లా ఉన్నతాధికారి పర్యవేక్షణ లోపమా.. ఆయనే ఆమ్యామ్యాలకు తెరలేపుతున్నారా... అన్న ప్రశ్న అందరి మెదళ్లలో నానుతుంది.
24 గంటల విద్యుత్ లైన్ నుంచి అగ్రికల్చర్కు యదేచ్చగా కనెక్షన్
సిద్దిపేట డివిజన్ పరిధిలో 24 గంటల విద్యుత్ లైన్ నుంచి అగ్రికల్చర్ కు కనెక్షన్ ఇచ్చారు. ఈ కనెక్షన్లు ఇవ్వడం వెనక వేలాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తుంది. ఈ విషయం ఈ నోటా ఆ నోట ఉన్నతాధికారుల దృష్టికి చేరినప్పటికీ సదరు తప్పిదం చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు తప్పు చేసిన అధికారుల నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని తెలుస్తుంది.
స్టోర్లో బినామీలదే హవా..
సిద్దిపేట జిల్లాకు చెందిన స్టోర్ లో బినామీల హవా సాగుతుంది. ఉన్నతాధికారి పర్యవేక్షణ, ఏడి స్థాయి అధికారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్టోర్ లో ఒకే వ్యక్తికి సంబంధించిన ఆయా ఫర్ములకు సగానికి పైన ఎల్పిఓలను అందజేయడం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదు.
ఉన్నతాధికారి పాత్ర మూలంగానే బినామీ కాంట్రాక్టర్ రాజ్యమేలుతున్నారని తెలుస్తుంది. మొత్తంగా జిల్లా విద్యుత్ శాఖలో ఏం జరుగుతుందోనన్న అనుమానం ఆ శాఖ సిబ్బందిలో నిత్యం చర్చనీయాంశంగా ఉంది.