calender_icon.png 30 June, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏది ముందు.. ఏది వెనుక?

30-06-2025 12:34:28 AM

రాకపోకలకు ఇబ్బంది అభివృద్ధికి ఆటంకం!

మహబూబాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు ఏవీ కూడా కొసల్లెట్లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తు న్నారు. 20 కోట్ల వ్యయంతో అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. ఇందుకోసం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను పూర్తిగా తొలగించారు.

కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు విస్తరణ కోసం గ్రావెల్ పనులు కూడా నిర్వహించారు. మార్కింగ్ 80 అడుగులకు చేసి పనులు ఇక ప్రారంభిస్తారని భావిస్తుండగా, అంతటితో వదిలేశారు. ఇక ఇదేవిధంగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణం పనులను తొలుత శరవేగంగా నిర్వహించారు. కల్వర్టులు, చిన్న బ్రిడ్జిలు నిర్మించకుండా రోడ్డు పూర్తిగా విస్తరించి కంకర పరిచారు.

తారు వేయకుండా వదిలేసి, ఇప్పుడు తీరా వర్షాలు కురిసే సమయంలో కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నారు. ఇక ఇదే తరహాలో 22 కోట్ల రూపాయల వ్యయంతో జూనియర్ కళాశాల నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు రోడ్డు విస్తరణ పనులను కూడా ప్రారంభించారు.

ఇప్పటికే చేపట్టిన రెండు రోడ్ల పనులను పూర్తి చేయకముందే మూడో రోడ్డు పని ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. ఏకకాలంలో మూడు రోడ్ల నిర్మాణం పనులను చేపట్టడం వల్ల పట్టణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. 

రోడ్ల విస్తరణ కుదించాలని ఆందోళనలు

ఓవైపు పట్టణంలో ప్రధాన రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కోట్ల రూపాయలు మంజూరు చేయించి రోడ్ల పనులకు టెండర్లు కూడా ఖరారు చేయించారు. ఇందులో ప్రధాన రహదారులను తొలుత 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించినప్పటికీ, ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 80 అడుగులకు తగ్గించారు.

అయితే ఇప్పుడు 80 అడుగులు కూడా వద్దని, 60 అడుగులకు తగ్గించాలని భూ నిర్వాసితులు ఆందోళనల బాట పట్టారు. 80 అడుగులు విస్తరిస్తే తమ షాపులు, ఇండ్లు కోల్పోవాల్సి వస్తుందని, అనేకమంది జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పనులను ఏకకాలంలో చేపట్టడంతో భూ నిర్వాసితులంతా మూకుమ్మడిగా దశల వారి ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

శనివారం అంబేద్కర్ సెంటర్లో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకొని యంత్రాలను వెనక్కి పంపారు. అటు రోడ్ల విస్తరణ, ఇటు ఆందోళనలతో కేసముద్రం పట్టణ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారి పనుల నిర్వహణ అగమ్య గోచరంగా మారింది.