25 April, 2026 | 3:48 AM

ప్రాణాలు పోతే గాని స్పందించరా?

25-04-2026 02:12 AM

కట్టలు తెంచుకున్న ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం, మూడో రోజు ఉధృతంగా మారిన ఆర్టీసీ సమ్మె

తాండూరు, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : మా సమస్యలు , డిమాండ్లు పరిష్కారం కావాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు కావాలో చెప్పండి...ప్రాణాలైనా అర్పిస్తాం మా డిమాండ్లను సాధించుకుంటాం అని వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికులు నినదించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో బస్సు డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.  శుక్రవారం ఆర్టీసీ కార్మికులు,సిబ్బంది, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మౌన ర్యాలీ నిర్వహించారు.

ఈ సమ్మెకు సిపిఎం, టీజేఎస్ ,టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు మద్దతు ఇచ్చారు. మూడో రోజు సమ్మె  కొనసాగడంతో బస్సులు రోడ్డెక్కక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోగా..సమ్మెను పోలీసు బలగాలతో దౌర్జన్యంగా కాల రాసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నమే తప్ప. చట్టానికి విరుద్ధంగా సమ్మె చేయడం లేదని అన్నారు.