13-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమల కొరకు కృషి చేస్తానని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ఎల్జి గార్డెన్ లో పి ఆర్ టి యు టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరకు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ స్కీము వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ మాట్లాడుతూ టెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుందని అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలవారీగా 700 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలికి పోటీ చేసిన అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల పదోన్నతి పొందిన 153 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.