12 May, 2026 | 1:46 AM

కల్లూరుగూడెంలో వేగంగా పామాయిల్ ఫ్యాక్టరీ పనులు

12-05-2026 12:35 AM

ఖమ్మం జిల్లాలోనే తొలి పామాయిల్ ఫ్యాక్టరీ. 

రాజకీయ పురిటి గడ్డమీద మంత్రి తుమ్మల అభివృద్ధి మార్క్.

వేంసూర్ మే 11 (విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని తొలి పామాయిల్ ఫ్యాక్టరీ కావడం దీని విశిష్టత. వరి పంటలకు బదులు వాణిజ్య పంటలైన పామాయిల్ పంటలను సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్న దృష్ట్యా రైతులకు మరింత అందుబాటులో ఉండేందుకు ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల దూర దృష్టితో కల్లూరు గూడెంలో నిర్మించ తలపెట్టినారు.

ఇక్కడ నిర్మించే ఈ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లాలోని సుమారు 40,000 ఎకరాల్లో పామాయిల్ పండించే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నిర్మించే ఈ ఫ్యాక్టరీ తొలుత గంటకు 15 టన్నుల కెపాసిటీతో ప్రారంభం అయ్యి క్రమేపి గంటకు 60 టన్నుల కెపాసిటీగా విస్తరించనున్నది.

మంత్రి తుమ్మలకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లిని తాను జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పురిటి గడ్డను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తుమ్మల పలుమార్లు బహిరంగంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మంత్రి తుమ్మల మంత్రి పదవి చేపట్టి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రాంత రైతులు తుమ్మల అభివృద్ధిని స్మరించుకుంటూ, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని వారు కోరుకుంటున్నారు కాగా ఈ ఫ్యాక్టరీని 2025 మే 30వ తేదీన మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.