16-01-2026 05:16:51 PM
ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి
బెజ్జూర్,(విజయక్రాంతి): దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో దంత వైద్య సేవలు అందించడానికి టీడీఎస్ఎ ముందుకురావడం అభినందనీయమని అన్నారు. గతంలో టీడీఎస్ఎ సంఘ ఆవిష్కరణ తన చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిందని, ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయమని తెలిపారు.
ప్రజలు దంత ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు.తంబాకు,గుట్కా, కర్ర నమలడం వలన అనేక నోటి క్యాన్సర్లు వస్తున్నాయని, ప్రజలు వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి సమస్యలు దరి చేరవని తెలిపారు.ప్రతి మంగళవారం ప్రజా లైఫ్ కేర్ ఆస్పత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యేను, సర్పంచులను వైద్య సిబ్బంది సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ డా.మణిదీప్ బలుసాని, బెజ్జూర్ ప్రాథమిక ఆసుపత్రి డా.శ్రావణ్ కుమార్, డా.శ్రీనివాస్, డా.కీర్తి, సెక్రటరీ డా.సామల రసజ్ఞ, డా.హర్షిని, డా.సౌమ్య, డా.షఫియా, సర్పంచ్లు దుర్గం సరోజ తిరుపతి, కుమ్మరి రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ గూడ రాకేష్, వషి ఉల్లా ఖాన్, మండల అధ్యక్షులు జాడి తిరుపతి, మాజీ ఎంపిపి కోండ్ర మనోహర్ గౌడ్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.