08-12-2025 12:42:24 AM
అభివృద్ధి, ప్రజాసేవే ప్రధాన లక్ష్యం
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్07,(విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్డౌన్ మొదల వుతుండగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో వెంకటాపూర్ గ్రామపంచాయతీ వివిధ వార్డుల్లో బీజేపీ పార్టీ నుంచి యువ అభ్యర్థులు వార్డు పోటీలోకి దిగడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశమైంది. మార్పు, అభివృద్ధి, పారదర్శకతఈ మూడు అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని యువత ముందుకు రావడం గమనార్హం.
ప్రజాసేవే ప్రధాన ధ్యేయం: బీజేపీ యువ అభ్యర్థులు
వార్డుల్లో ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లోపాలు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు, వెలుతురు సదుపాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు చేరువ కావాలని అభ్యర్థులు చెబుతున్నారు. పెద్దలుచిన్నలు అన్న తేడా లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటామని, వాటి పరిష్కారానికై కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.
వార్డు రాజకీయాల్లో కొత్త ఉత్సాహం
యువత బరిలోకి దిగడంతో వార్డు స్థాయి రాజకీయాల్లో కొత్త ఉత్సాహం తిరిగి కనిపిస్తోంది. ఇప్పటి వరకు సాంప్రదాయ అభ్యర్థులకే మద్దతు లభించేవి. అయితే ఈసారి యువతా నాయకత్వం ముందుకు రావడం వల్ల ఓటర్లు కూడా కొత్త ఆశలు పెంచుకున్నారు. ఆధునిక ఆలోచనలతో, సోషల్ మీడియా ప్రచారంతో యువ అభ్యర్థులు ప్రతి ఇంటికీ చేరుతున్నారు.
ఇతర పార్టీలలో అలజడి
బీజేపీ యువ అభ్యర్థుల ప్రవేశం ఇతర పార్టీల వ్యూహాలను ప్రభావితం చేస్తోంది. యువతను ఆకర్షించేలా ప్రచార విధానాలు మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సాంప్ర దాయ ఓటు బ్యాంకులు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అభివృద్ధిపైనే దృష్టి
వార్డు స్థాయిలో చిన్న చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం కోసం తాము పోటీ చేస్తున్నామని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. ప్రజలకు చేరువగా ఉండే నాయకులే కావాలని ఓటర్లు కోరుకుంటున్న నేపథ్యంలో యువత ప్రవేశం ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో యువత నాయకత్వం ఎలా మెరుగు చేస్తుంది, వార్డు రాజకీయ దిశ ఎలా మారుతుంది, బీజేపీ అభ్యర్థుల ప్రచారం ఎంతవరకు ప్రజాదరణ పొందుతుంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం మార్పు కోసం యువత బరిలోకి రావడం స్థానిక ఎన్నికల్లో కొత్త శకానికి నాంది కావొచ్చు.