19-01-2025 12:00:00 AM
స్వామిత్వ పథకం..
న్యూఢిల్లీ, జనవరి 18: సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ) పథకం కింద ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా 65లక్షల మందికిపైగా ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొనగా.. దేశంలోని 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230 జిల్లాల లబ్ధిదారులు ఆస్తి కార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు అలాగే లబ్ధిదారులకు నా అభినందనలు’ అని పేర్కొన్నారు. అలాగే ఐదేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.5కోట్ల మందికి స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. తాజాగా మరో 65లక్షల కుటుంబాలు ఈ కార్డులను అందుకున్నట్టు చెప్పారు. దీంతో గ్రామాల్లో తమ ఇంటికి సంబంధించిన ఆస్తి కార్డులను పొందిన వారి సంఖ్య 2.25కోట్లకు చేరినట్టు వెల్లడించారు. కాగా స్వామిత్వ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో సర్వే నిర్వహించి ప్రజలకు తమ ఇంటికి సంబంధించిన చట్టబ ద్ధమైన ఆస్తి కార్డులను అందజేస్తున్న విష యం తెలిసిందే.