22-12-2025 10:05:42 PM
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
గద్వాల: మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎరువులు విక్రయించే డీలర్లు ఫర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డీలర్లకు ఫర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మన జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొంత ఫర్టిలైజర్ కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ,
రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాకు ఇలాంటి యాప్లు సహకరిస్తాయని పేర్కొన్నారు. తమ మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని బుకింగ్ లావాదేవీల నిర్వహణపై డీలర్లకు సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారులు సహకరించాలన్నారు. యాప్ ద్వారా ఎరువుల కొనుగోలులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే విషయాన్ని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రతి డీలరు యాప్ ను డౌన్లోడ్ చేసుకుని విజయవంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, కోపరేటివ్ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.