calender_icon.png 2 June, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ సుందరి సుచాత

01-06-2025 01:38:17 AM

మిస్ వరల్డ్-2025 ఎంపికైన థాయిలాండ్ ముద్దుగుమ్మ

హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగిన ఫినాలే

1వ రన్నరప్: మిస్ ఇథియోపియా హస్సెట్ డెరెజె అడ్మాస్సు

2వ రన్నరప్: మిస్ పోలెండ్ మజా క్లాజ్డా 

3వ రన్నరప్: మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్

నటుడు సోనూసూద్‌కు మిస్‌వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు

టాప్-8లోనే ఆగిన మిస్ ఇండియా నందిని గుప్తా 

వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు హాజరు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): మిస్‌వరల్డ్-202౫5 టైటిల్‌ను థాయిలాం డ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ గెలుచుకున్నారు. విజేత రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ, 1,770 వజ్రాలు పొదిగిన కిరీ టం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం పొందనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మిస్ వర ల్డ్ సీఈవో జూలియా మోర్లీ సమక్షంలో మిస్‌వరల్డ్-2024 క్రిస్టినా పిజ్కో వా ఆమెకు కిరీటధారణ చేశారు.

అలాగే మొ దటి రన్నరప్‌గా ‘మిస్ ఇథియోపియా’ హస్సెట్ డెరెజె అడ్మాస్సు, 2వ రన్నరప్‌గా ‘మిస్ పోలెండ్’ మజా క్లాజ్డా, 3వ రన్న రప్‌గా ‘మిస్ మార్టినిక్’ ఆరేలీ జోచిమ్ నిలిచారు. మిస్‌వరల్డ్ పోటీలకు న్యాయనిర్ణేత ప్యానెల్‌లో కీలకంగా వ్యవహరించిన నటు డు సోనూసూద్‌కు నిర్వాహకులు ‘మిస్‌వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు’ అందజేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శని వారం రాత్రి అట్టహాసంగా ‘మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే’ జరిగింది.

అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సుధారెడ్డి కూడా న్యాయనిర్ణేత గా వ్యవహరించారు. జ్యూరీ సభ్యులుగా నటుడు దగ్గుబాటి రానా, నటి, మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వ్యవహరించారు. ఈవెంట్‌లో నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నది.

కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌రావు, నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండ, మాజీ మిస్‌వరల్డ్ మానిషి చిల్లర్, రాజకీయ పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

టాప్‌t 8 నుంచి మిస్ ఇండియా నందినిగుప్తా ఔట్..

మిస్ వరల్డ్-2025 ఫినాలేలో టాప్-8 నుంచి మిస్‌ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు. అంతకుముందు ఆమె ఫాస్ట్ ట్రాక్ విన్నర్‌గా ఆసియా నుంచి ఎంపికయ్యారు. టాప్-5లోనూ ఆసియా నుంచి ఎంపికయ్యారు. టాప్- 8లో  థాయిలాండ్, మార్టినిక్, ఉక్రెయిన్, పోలెండ్, ఇథియోపియా, నమీబియా, ఫిలిప్ఫున్స్, బ్రెజిల్ దేశాలకు చెందిన సుందరీమణులు నిలిచారు.

‘నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు?’ అనే ప్రశ్నకు 45 సెకన్లలో ఉత్తమ సమాధానం చెప్పిన అందగత్తెలకు జడ్జీలు మార్కులు వేశారు. ఆసియా అండ్ ఓషియానా కాంటిఎనెంట్ నుంచి ఫిలిప్ఫున్స్, థాయిలాండ్ కంటెస్టెంట్లు టాప్-8కి అర్హత సాధించారు. జడ్జీల ప్రశ్నలకు మెరుగైన సమాధానాలు చెప్పిన టాప్-4 అందాల భామలు గ్రాండ్ ఫినాలేకు ఎంపికయ్యారు.

అమెరికా నుంచి మార్టినిక్, ఆసియా నుంచి థాయిలాండ్, యూరప్ నుంచి పోలెండ్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా దేశాలకు చెందిన సుందరీమణులు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫైనల్స్‌లో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన మిస్‌థాయిలాండ్ సుచాత చివరకు టైటిల్‌ను దక్కింకున్నారు.

అందాల  భామల పర్యటన సాగిందిలా..

గతనెల 10న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా అందాల పోటీల ప్రారంభమయ్యాయి. ఇదే నెల 13న సుందరీమణులు చార్మినార్, లాడ్‌బజార్‌ను సందర్శించారు. 14న వరంగల్‌లోని  వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, 15న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పోచంపలి గ్రామాన్ని సందర్శించారు.

16న గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిని, పాలమూరులోని పిల్లలమర్రిని సందర్శించారు. 17న రామోజీ ఫిల్మ్ సిటీ, 18న తెలంగాణ సచివాలయం, 20న టీహబ్, 21న శిల్పారామాన్ని సందర్శించారు. 22న మిస్ వరల్ టాలెంట్ ఫినాలేలో పాల్గొన్నారు.

అనేక పర్యటనల తర్వాత శనివారం (31న) హైటెక్స్‌లో ఫినాలే జరిగింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిస్‌వరల్డ్ విజేత సుచాత హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, తేనేటి విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంతో మిస్‌వరల్డ్ పోటీలు పూర్తవుతాయి.

ఎవరీ సుచాత..

సుచాత స్వస్థలం థాయిలాండ్‌లోని ఫుకెట్  16 ఏళ్ల ప్రాయంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ముందస్తుగా గుర్తించి ఆమె క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డారు. అప్పటినుంచి థాయిలాండ్‌లో ఆమె రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రాతినిథ్యం వహించడం మొదలుపెట్టారు. 2024లో మెక్సికో నగరంలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో సుచాత మూడో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత హైదరాబాద్ మిస్‌వరల్డ్ పోటీలకు విచ్చేశారు. సుచాత ఓపల్ ‘ఫర్ హర్..’ అనే నినాదంతో పోటీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు 108 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధే ధ్యేయంగా పోటీలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధే ధ్యేయంగా మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహించామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ  సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకుల సహకారంతో రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి  చెప్పగలిగామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం మున్ముందు కూడా ఇదే అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, దిశానిర్దేశంతోనే ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.