17-06-2025 11:24:54 PM
ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పటిష్ట చర్యలు..
బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహణ..
ఖమ్మం (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమ అంశాలలో ఖమ్మం జిల్లా కొనసాగిస్తున్న విజయగాధను కొనసాగించాలని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(District Collector Muzammil Khan) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలో నిర్వహించిన ఐఎఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ సంచాలకులుగా బదిలీపై వెళ్తున కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు. కలెక్టరేట్ కు చేరుకున్న ముజమ్మిల్ ఖాన్ కు గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్.సి.సి. కెడేట్స్, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారని, స్నేహపూర్వక వాతావరణంలో అధికారులంతా మంచి బృందంగా ఏర్పడి ప్రజా సమస్యలు పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో తమకు ఉన్న అనుభవాలను తెలియజేశారు.
అందరి సహకారంతో జిల్లా అభివృద్ది:
ఈ సందర్భంగా బదిలీపై పౌరసరఫరాల శాఖ సంచాలకులుగా వెళ్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ గా తన ప్రస్థానాన్ని ముజమ్మిల్ ఖాన్ వివరించారు. ఖమ్మం నేల చాలా పవిత్రమైందని, ఇక్కడ పని చేయడంలో చాలా సంతృప్తి లభిస్తుందని, వరదల సమయంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేశారని అన్నారు. ప్రజలకు నేరుగా క్షేత్రస్థాయిలో ఇంటారాక్ట్ అవుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం లభించిన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ... ఖమ్మం అభివృద్ధి చెందేందుకు, జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా పని చేసేందుకు అధికారులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేందుకు పదవి విరమణ పోందుతున్న సిబ్బందిను సన్మానిస్తూ ప్రస్థానం కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, రెవెన్యూ డివిజన్ అధికారులు నర్సింహారావు, రాజేందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి, జిల్లా అధికారులు, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.