11-01-2026 12:23:33 AM
‘నో హెల్మెట్-నో పెట్రోల్’ కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ, జనవరి 10 (విజయక్రాంతి): హెల్మెట్ ధరించి బైక్పై ప్రయాణించడం వలన తన ప్రాణాలకు రక్షణతో పాటు కుటుంబానికి భరోసా కలుగుతుందని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి నో హెల్మెట్-నో పెట్రోల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బైక్ నడిపే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, తద్వారా వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయన్నారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలనే సదుద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం చేపట్టామన్నారు. హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా పకడ్బందీగా కట్టడి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం 500 మంది ద్విచక్ర వాహనదారులకు బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు జెట్టి సోమ నరసయ్య, నాగభూషణరావు పాల్గొన్నారు.