15-08-2025 12:48:40 AM
విద్యుదాఘాతంతో అటెండర్ సహా ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
మహాదేవపూర్, ఆగస్టు 14 (విజయ క్రాంతి): ముగ్గురు విద్యార్థులు, అటెండర్ విద్యుదాఘాతానికి గురికాగా వెంటనే పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కర్రతో విద్యుదాఘాతానికి గురైన పైపును విడగొట్టడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాఠశాలలో శుక్రవారం నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకల కోసం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఇనుప పైపును అటెండర్ నవీన్ ముగ్గురు విద్యార్థులు శ్రీరామ్, నవనీత్, రామ్ చరణ్ తో కలిసి తీసుకెళ్తుండగా ఇనుప వైపు పైన విద్యుత్తు లైన్ కు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు.
వెంటనే ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది, ఉపాధ్యాయులు కర్ర తీసుకొని విద్యుత్ లైన్ నుంచి ఇనుప పైపును విడగొట్టడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే గాయపడ్డ వారిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు.