మండల కేంద్రంలో అందుబాటులో ఆధార్ సేవలు
గుండాల, జనవరి 27 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆధార్ కార్డు సేవలు గత కొన్ని సంవత్సరాలుగా అందుబాటులో లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇకపై అటువంటి ఇబ్బంది లేదని మీ సేవా నిర్వాహకులు ఇర్పా కిషోర్ మంగళవారం తెలిపారు. ఆధార్ కార్డు అప్డేట్, అడ్రస్, మొబైల్ నెంబర్ లింక్ తదితర ఆధార్ సమస్యలు మండల కేంద్రంలోనే పరిష్కరించుకోవచ్చని, అరవై కిలోమీటర్లు ఉన్న ఇల్లందు వెళ్ళాల్సిన అవసరం ఇకపై లేదని ఆయన తెలిపారు.
మండల ప్రజలు ఆధార్ సమస్యలపై సుదూర ప్రాంతాలకు వెళ్లి అవస్థలుపడుతున్నారని, మండల కేంద్రంలోనే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కిషోర్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలోని ఆధార్ క్యాంపులలో కిషోర్ అందించిన ఉత్తమ సేవలకు 23 శుక్రవారం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆయన ఛాంబర్ లో కిషోర్కు ప్రశంసాపత్రం అందించి, ముందు ముందు ఇదే విధంగా నాణ్యమైన సేవలు అందించాలని అభినందించారు.




