18-07-2025 12:00:00 AM
నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు
సదాశివపేట, జూలై 17 : సంగారెడ్డి జిల్లా సదాశివపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు పలు డాక్యుమెంట్లను, రికార్డులను పరిశీలించారు.
కార్యాలయంలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగుతుందనే ఫిర్యాదుతోనే ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా 12 మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుండి రూ.7,550 నగదు లభించినట్లు తెలిపారు. మరో 30 డాక్యుమెంట్లు కొనుగోలుదారులకు అందజేయలేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సరిగా రికార్డులు నమోదు చేయడం లేదని, నగదు లావాదేవీలకు సంబంధించి తేడాలు కనిపించాయని తెలిపారు.
అలాగే డాక్యుమెంట్లపై కొనుగోలుదారుల సెల్ నంబర్లు రాయాల్సి ఉండగా ప్రైవేట్ డాక్యుమెంట్ల నంబర్లు రాస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదనే నిబంధన ఉందని, తనిఖీ సమయంలో ఎస్ఆర్వో వద్ద ఇద్దరు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని తెలిపారు. కాగా తనిఖీలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.