రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి
- మే 10 వరకు శంకుస్థానకు సిద్దం చేయండి
- పనులను పరిశీలించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఏప్రిల్ 27(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో రూ.3 కోట్లతో చేపడుతున్న రాజీవ్ పార్క్ పునరుద్దరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీవ్ పార్క్ లో పర్యటించి పనులను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాజీవ్ పార్క్ ఎంట్రెన్స్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న చోట ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేప్ డిజైన్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న బ్లాక్ గ్రానైట్ స్థానంలో వేరే టైల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
పార్క్ లో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్ పాడైన నేపథ్యంలో కొత్త అధునాతన మ్యూజిక్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని, రోజూ సాయంత్రం వేళలో రెండు పాటలతో ఫౌంటెన్ నడిచే విధంగా ఉండాలని కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడి సూచించారు. ఇప్పుడు మంజూరైన రూ.3 కోట్లతో కేవలం పునరుద్ధరణ పనులకే సరిపోతాయని అధికారులు జగ్గారెడ్డి కి వివరించారు.
సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మే 10లోగా పార్క్ లో గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు పూర్తి చేయాలని, పార్క్ ముందు భాగంలో పనులు పూర్తి చేసి సీఎంతో ఫౌండేషన్ స్టోన్ వేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డిఈ, నాయకులు తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






