16-06-2025 12:16:43 AM
జగిత్యాల, జూన్ 15 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇరువురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. కోరుట్ల - మెట్పల్లి ప్రధాన రహదారిని ఆనుకొని జి.ఎస్.గార్డెన్ సమీపంలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం తయారు చేసిన భారీ వినాయక విగ్రహాన్ని 9 మంది కలిసి పక్కకు తరలిస్తున్నారు.
పై భాగాన కొనరావుపేట, వల్లంపల్లి ఫీ డర్ల 33 కెవి విద్యుత్ లైన్ వెళ్తున్నది. ఈ క్రమంలో అప్పుడే తయారు చేసిన వినాయక విగ్రహం తడిగా ఉండడంతో విగ్రహానికి 33 కెవి విద్యుత్ లైన్ తగిలి విగ్రహానికి మొత్తం షాక్ వచ్చింది. దాంతో విగ్రహాన్ని పట్టుకున్న 9 మంది విద్యుత్ షాక్’కు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను మొదట కోరుట్ల సివిలాస్పత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండడంతో జగి త్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో స్థానిక ప్రకాశం రోడ్డుకు చెందిన అల్వాల వినోద్(28), అర్బన్ కాలనీకి చెందిన నెల్లుట్ల బంటి(35) అనే ఇరువురు మృతి చెందారు. అల్వాల నితిన్, వెంకట్రెడ్డి రాజేష్, నెల్లుట్ల కృష్ణ, సాయినాథ్, హనుమంతు, ఆకాష్ రోషన్ అనే వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇరువురు ఉత్తరప్రదేశ్, ఇరువురు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడే ఉన్న జగిత్యాలకు చెందిన క్రేన్ ఆపరేటర్ హర్షద్ ప్రమాద సంఘటనతో భయభ్రాంతులకు గురై సొమ్మసిల్లాడు.
జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ బి.సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కోరుట్ల సెగ్మెంట్ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావులు జగిత్యాల ఆసుపత్రికి వెళ్లి, క్షతగాత్రులను పరామర్శించి, పరిస్థితిసమీక్షించారు.