01-09-2025 07:02:26 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ లోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ డిమాండ్ చేశాడు. ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో అనుమతి లేకుండా సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణపై సోమవారం రోజున డి ఐ ఇ ఓ బి.గోపాల్ గారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ సుజాత గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గండ్రకోట రాకేష్ యాదవ్ మాట్లాడుతూ... ఇంటర్ విద్యాశాఖ అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ కళాశాలలో సెలవు దినాల్లో తరగతులను నిర్వహించడం జరిగిందని, అనుమతి ఉందా అని ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించి పర్మిషన్ ఉందని బుకాయించే ప్రయత్నం చేశారన్నారు.
ఆదివారం రోజు కూడా సెలవు లేకుండా పిల్లలపై మానసిక ఒత్తిడిని కలగజేస్తూ, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తరగతుల పేరా విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ,వారికి ఉన్న విరామ సమయాన్ని కళశాలలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థులకు మానసికంగా కుంగదీస్తున్నారని అన్నారు. ఇరుకు గదుల్లో, కనీస వసతులు లేకుండా ఆల్ఫోర్స్ కళాశాల తరగతులను నిర్వహిస్తోందని విమర్శించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి, విద్యను వ్యాపారం చేస్తున్న ఆల్ ఫోర్స్ వంటి కళాశాలలను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యను నిర్బంధ విద్యగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కార్పొరేట్ శక్తులకు ఈ ప్రభుత్వం, అధికారులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.