09-05-2024 01:17:14 AM
సిబ్బంది మూకుమ్మడి సెలవులు
రాత్రికి రాత్రే 80కి పైగా సర్వీసులు రద్దు
ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 8 (విజయక్రాంతి) : టాటా సన్స్ అధీనంలోని ఎయిర్ ఇండి యా విమానయాన సంస్థలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న 300 మందికి పైగా సిబ్బంది మంగళవారం మూకుమ్మడి సెలవులు పెట్టారు. సెలవులో వెళ్లిన వారంతా అనారోగ్యం కారణం చెప్పినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో 86 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం విమానాశ్రయాల పరిధిలో విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసినట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికుల అభ్యర్థన మేరకు విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తామని తెలిపింది. సిబ్బంది కొరత వల్ల కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం కావడం గానీ, రద్దు చేయడం గానీ జరుగుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమాన సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక మహిళా ప్రయాణికురాలు మీడియాతో మాట్లాడుతూ.. “నేను మే 9న నా గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ విమానాల రద్దు వల్ల మే 10న వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మా బాస్ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటున్నారు. నాకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సిక్ లీవ్ పెట్టి ఫోన్లు స్విచాఫ్
కంపెనీ యాజమాన్యం తమపై చూపిస్తున్న వివక్షపూరిత ధోరణిని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మూకుమ్మడి సెలవు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టిన సిబ్బంది తమ ఫోన్లను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో సిబ్బందితో చర్చలు జరిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైన అనంతరం క్యాబిన్ సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
గులాం నబీ ఆజాద్ ఆగ్రహం
ఎయిర్ ఇండియా విమానాల ఆకస్మిక రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికుల్లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాను మూసేయాలని డిమాండ్ చేశారు. ఆజాద్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సి ఉండగా ఆయన ఎక్కాల్సిన విమానం కూడా రద్దయింది. దీంతో విమానాశ్రయంలోనే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.