09-05-2024 01:13:26 AM
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ, మే 8: ‘ఢిల్లీ వడ పావ్ గర్ల్’గా ప్రసిద్ధి గాంచిన చంద్రికా దీక్షిత్ మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ రాజధానిలోని ఓ షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఆమె ఫోర్డ్ ముస్తాంగ్ కారు నుంచి రాయల్గా బయటకు దిగారు. చేతిలో ఐఫోన్, మణికట్టుకు యాపిల్ వాచ్, చెవిలో ఎయిర్ బడ్స్తో కనిపించారు. ఓ ఔత్సాహిక యువకుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఆమె మరో ఎత్తుకు ఎదిగేందనడానికి చిహ్నంగా, మరోద పెద్ద లక్ష్యాన్ని ఛేదించే దిశలో ఆమె వెళ్తున్నట్లు కనిపిస్తున్నదని వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వడా పావ్ అమ్మాయి ఇక ఫోర్డ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించిందని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఇన్స్టా గ్రాంలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికే సుమారు 5 లక్షల మంది వీక్షించారు. చంద్రికా దీక్షిత్ కొన్నేళ్ల క్రితం తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలోని సైనిక్ విహార్లో సొంతంగా వడా పావ్ స్టాల్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె స్టాల్ను మూసేయా లని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నోటీసులు అందుకున్నారు. స్టాల్ అనుమతులకు మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన మొత్తాన్ని తాను చెల్లించినప్పటికీ అధికారులు ఇంకా ఎక్కువ అడుగుతున్నారని సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో వైరల్ అయింది. ఏదేమైనప్పటికీ ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టనష్టాలను అధిగమించి ఆమె గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తినిస్తున్నది.