09-05-2024 01:22:55 AM
బీజేపీ, ప్రధాని మోదీపై ప్రియాంక ఫైర్
మోదీ, అదానీల మధ్య సంబంధం బయటపెడుతున్నాం
మోదీ స్నేహితులకు దోచిపెట్టారు
రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదు
రాయ్బరేలీ, మే 8: సార్వత్రిక ఎన్నికల వేళ విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ నాయకులు వాతావరణంలో మరింత వేడి రాజేస్తున్నారు. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెడుతుంటే.. రాహుల్ చెల్లెలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోదీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ.. అదానీ, అంబానీలను ఈ మధ్య విమర్శించట్లేదు ఎందుకో అంటూ మోదీ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అదానీ గురించి రాహుల్ గాంధీ ప్రతిరోజూ మాట్లాడుతారని, అదానీకి సంబంధించిన నిజాలన్నీ బట్టబయలు చేస్తున్నారని చెప్పారు. ‘పెద్ద పెద్ద వ్యాపారులకు, నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సంబంధాల గురించి రాహుల్ గాంధీ ప్రతిరోజూ చెబుతుంటారు. నరేంద్ర మోదీ ఆయన స్నేహితులకు సంబంధించిన రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. కానీ రైతులకు సంబంధించిన రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.
అందుకే మోదీకి నచ్చట్లేదు..
కాంగ్రెస్ మ్యానిఫెస్టో తాము చేసే పని గురించి మాత్రమే చెబుతుందని అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చట్లేదని ప్రియాంక గాంధీ అన్నారు. తాము యువతకు, మహిళలకు, ద్రవ్యోల్బణం, సంపదను దేశ ప్రజలకు తిరిగి ఇవ్వడం గురించి మాత్రమే తమ మ్యానిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. వారందరికీ తాము మంచి చేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచినందుకే ప్రధాని మోదీ మొదటి నుంచీ తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘ఎన్నికల్లో అసలైన సమస్య ఏంటంటే.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళలపై అరాచకాలు, ప్రజల ఇబ్బందులు, రైతులు సమస్యలు ఇవీ అసలు సమస్యలు.. వీటి గురించి ఎన్నికల్లో పోరాడాలి. అందుకే మేం మ్యానిఫెస్టోలో పొందుపరిచాం. కానీ వారు మా మ్యానిఫెస్టోపై సంబంధంలేని విమర్శలు చేస్తున్నారు’ అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
బీజేపీకి అదే పని..
రాహుల్ గాంధీ గురించి పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేయడమే బీజేపీ పని అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. బీజేపీ ఎప్పుడూ మతం, కులం, గుడులు, మసీదుల గురించే మాట్లాడుతుంది కానీ.. అసలైన సమస్యల గురించి మాట్లాడదని మండిపడ్డారు. రాయ్బరేలీ ప్రజలు రాజకీయ నాయకులను బాగా అర్థం చేసుకుంటారని చెప్పారు.