13-12-2025 02:49:02 PM
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సామాగ్రి తనిఖీ.
ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం 7 మండలాల్లో జరగనున్నాయి.శనివారం ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయగా ఎన్నికల సిబ్బంది సామాగ్రిని సేకరించారు. ఆయా మండలాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై వెంటనే సస్పెన్షన్కు ఉత్తర్వులివ్వాలని డీఈఓను ఆదేశించారు. రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి పోలింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాలు, తిమ్మాజీపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి పలు సూచనలు చేశారు.