14-05-2025 12:41:22 AM
- ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామంలోకి రాకుండా చూడాలి
-డీఈవో సుసింధర్ రావు
ఇబ్రహీంపట్నం, మే 13:బడిఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని డి.ఈ.ఓ సుసింధర్ రావు అన్నారు. మంగళవారం మంచాల మండలం ఆరుట్లలో గ్రామంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎ.బాలశంకర్ ఆధ్వర్యములోగ్రామసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డి.ఈ.ఓ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ఆరుట్ల గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
గ్రామంలోని పాఠశాలను ఆధునికరించడంతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనీ అన్నారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కావలసినంత సిబ్బందిని నియమించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పాఠశాలలో విధ్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందని అన్నారు.
జిల్లాలో ఏ పాఠశాలకు రాని అవకాశం, ఆరుట్ల జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామసభ తీర్మాణము ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్చాలని, ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామంలోకి రాకుండా చూడాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుప్రియ, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మాజీ ప్రజాప్రతినిధులు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్, జంగయ్య, భాస్కర్ విజయ కమిటీ సభ్యులు, శ్రీశైలం, జానీ, పాషా, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.