06-09-2025 11:45:18 PM
ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ ను అందజేసిన బీజేపీ వెహికల్ ఇంఛార్జీ సాంబాయిపల్లి
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన సొంత నిధులతో వేములవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అంబులెన్స్ ను అందించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వెహికల్ ఇంఛార్జీ సాంబాయిపల్లి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆ అంబులెన్స్ తోపాటు వాటికి సంబంధించిన పత్రాలను వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. బండి సంజయ్ గతంలోనూ వేములవాడసహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున వైద్య పరికరాలను అందించారు.
గతంలో తన పుట్టినరోజు సందర్భంగా సొంత ఖర్చులతో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువ గల వైద్య పరికరాలను అందించారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి పెద్ద ఎత్తున మెడికల్ ఎక్విప్ మెంట్లను అందించారు. కరోనా సమయంలోనూ వేలాదిమందికి రెమిడిసివర్ ఇంజక్షన్లను, పీపీఈ కిట్లను అందజేసి ప్రాణం పోశారు. బీజేపీ సురక్షా పేరిట వేలాది మందికి ఉచితంగా కాన్సట్రేటర్స్, రక్త దానం చేశారు. త్వరలోనే కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బిలిటీ (సీఎస్సార్) కింద దాదాపు రూ.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించేందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు. అతి త్వరలోనే ఆయా పరికరాలను వేములవాడసహా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అందించనున్నారు.