07-12-2025 12:12:00 AM
ప్రకృతి అందాల ఒడిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో దివ్యక్షేత్రంగా అనంతాద్రి విలసిల్లుతోంది. ఎత్తున కొండపై కొలువైన జగన్నాథ వెంకటేశ్వర స్వామి కోరి న కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. భక్తుల కొంగుబంగారమై నిత్యపూజలు అందుకుంటూ..బాసిల్లుతున్నాడు. ఈ క్షేత్రం భక్తుల పాలిటి ఉభయరూపాల అభయ క్షేత్రంగా ఆధ్యాత్మికంగా విరాసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సుభ ద్ర, బలరాముడు, జగన్నాథుడు ముగ్గురూ కొలువైన ఆల యం మహబూబూబాద్ జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో అనంతాద్రిలో ఉన్నది.
జగన్నాథడు బలరామ, సుభద్రల
సమేతంగా ప్రత్యక్షం
పూర్వం ఇక్కడి గుహల్లో అనేకమంది మహనీయులు తపస్సు చేసుకునేవారు. వారిలో ఒకరైన అనంతుడనే మహాత్ముని తపస్సుకి మెచ్చిన జగన్నాథడు, బలరామ, సుభద్రల సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. భక్తుని కోరిక ప్రకారం ప్రతి నిత్యం మనుషి రూపాల్లో వచ్చి అనంతుని ఆరాధన అందుకుని వెళ్లిపోయేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారంతా ఆ ముగ్గురినీ దివ్య పురుషులుగా భావించి సేవించేవారు.
వారి అనుగ్రహంతో ఎన్నో ప్రయోజనాలు పొందిన భక్తులు, కొత్త దంపతులను పసుపు బట్టలతో స్వామి దర్శనానికి తీసుకొచ్చి, కొంగు ముడంత బంగారాన్ని సమర్పించేవారు. అట్లా వారు సమర్పించిన బంగారమంతా ఈ కొండపైనే ఒక చెక్క పెట్టెలో భద్రపరిచేవారు. ఈ విషయం కనిపెట్టిన ఇద్దరు దొంగలు భక్తులవలె నటించి ఒకసారి ఈ బంగారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొంగలు జగన్నాథస్వామిని గాయపరచటానికి కూడా ప్రయత్నించారు.
అది గమనించిన స్వామి, సుభద్ర, బలరాముడు కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు విరజిమ్మతూ శిలా విగ్రహాలుగా మారిపోయారు. ఆ అద్భుతాన్ని చూసిన దొంగలిద్ద రూ భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. అలా అరుస్తూ వాళ్లు కూడా ఒక చోట బండరాళ్లగా మారిపోయా రు. వారి స్పర్శ తగిలిన బంగారం అంతా కూడా బండరాయిగా మారింది. ఆ ఇద్దరు దొంగల శిలలు, స్వర్ణ శిల, ఆలయానికి సమీపంలో ఉన్న కట్టమైసమ్మ గుడికి దక్షిణంవైపున నేటికీ చూడవచ్చు.
ఏకాంతంగా యోగముద్రాంకితులై..
శిలా విగ్రహాలుగా మారిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు అనంతాద్రి గుహలోనే సిద్ధులు, మహాయోగులు మాత్రమే సేవించగలిగేటట్లు ఏకాంతంగా యోగముద్రాంకితులై ఉండిపోయారు. చాలాకాలం తర్వాత ఒక గోవుల కాపరి అక్కడ తన గోవులను మేపుతుండగా ఒక నల్ల గోవు అనంతారం గుట్ట ఎక్కింది. గోవుని వెతుకుతూ కాపరి కూడా ఆ గుట్ట ఎక్కి అక్కడ గుహలో పులి కళ్లవంటి మెరుపును చూసి భయంతో పరుగు తీశాడు. ఆ సంగతి విన్నవారు ఆ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నదని భయపడి అటువైపు రావటం మానేశారు.
దానితో ఆ ప్రాంతమంతా కీకారణ్యంలాగా తయారైంది. చాలాకాలం తర్వాత స్వామికి మళ్లీ భక్తులనాదుకోవాలని అనిపించి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిగా అదే కొండపై వెలిసాడు. కొండగుహలో యోగంలో ఉన్న జగన్నాథునిగా, సమీపంలోనే భక్తుల భోగాలను అందుకునే వేంకటేశ్వరస్వామిగా రెండు అద్భుతమైన స్వయంభూ రూపాలతో భక్తులనాదరిస్తున్నాడు. ఇక్కడ జగన్నాథుడు యోగమూర్తి, వేంకటేశ్వరుడు భోగమూర్తి. అలా ఈ క్షేత్రం భక్తుల పాలిటి ఉభయరూపాల అభయ క్షేత్రంగా వెలిసింది.
అంచలంచెలుగా పునరుద్ధరణ
కీకారణ్యంలో ఉన్న ఈ స్వామి ఆలయా న్ని పునరుద్ధరించినది శ్రీ నూకల రామానుజులుగారు. ఒకసారి స్వామి ఆయనకు కలలో కనబడి తాను అనంతుడనే మహర్షి తపస్సు వల్ల సుభద్ర, బలరాముల సమేతంగా అక్కడ వెలిసినట్లు, తన యోగ శక్తితో శ్రీదేవీ భూదేవీ సమేతంగా వేంకటేశ్వరస్వామి కూడా అక్కడ స్వయం వ్యక్తమయినట్లు, తమ ఆలయాన్ని పునరుద్ధరించి పూజాధికాలు చేయమని ఆదేశించాడు. రామానుజులు గ్రామ పెద్దలతో అక్కడ అన్వేషించి స్వామిని కనుగొని, పూజాధికాలు చేయసాగారు. అక్కడికి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవటం వల్ల జనం రావటంతగ్గి మళ్లీ వైభ వం కోల్పోయిన ఈ ఆలయాన్ని నూకల వంశస్తులే 1885 సం. నుంచి నేటిదాకా అనేక మంది అంచలంచెలుగా పునరుద్ధరించారు. నేడు వైభవోపేతంగా తీర్చిదిద్దారు. కళ్యాణ మంట పం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి
స్వయంభుగా శ్రీఆంజనేయస్వామి
అనంతాద్రిక్షేతం క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయస్వామి కూడా సమీపంలో ఒక రాతి పలకపై స్వయంభుగా అవతరించాడు. ఈ విగ్రహాన్ని గురించి రెండు కథలు చెప్తారు. చాలా కాలంక్రితం ఈ ఆంజనేయస్వామికి ఇంకొక గ్రామంలో విడిగా ఆలయాన్ని నిర్మించుదామని విగ్రహాన్ని రెండెడ్ల బండిలో అక్కడికి తరలించారట. ఆ గ్రామానికి చేరగానే బండి ఎద్దులు రెండూ కుప్పకూలి పడిపోయాయట. ఆ గ్రామమంతా కూడా అనేక ఉపద్రవాలతో నిండిపోయిందట.
దీనిని గుర్తించిన పెద్దలు స్వామిని అక్కడి నుంచి కదిలించటం స్వామికి ఇష్టంలేదని గ్రహించి వెంటనే స్వామిని అనంతాద్రికి చేర్చారట. ఇంకోసారి కొందరు గుజరాతీ భక్తులు, ఇంత మహిమగల ఆంజనేయస్వామిని మానుకోటలో (మహబూబాబాదులో) ఒక ధర్మసత్రంలో ఉంచి, మందిరాన్ని నిర్మించుదామని అనుకున్నారు. ఆంజనేయస్వామి వారికి కలలో కనబడి, తాను అనంతాద్రిపైనే ఉంటానని, అక్కడే ప్రతిష్టించమని ఆదేశించారట. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి అయినా క్షేత్రస్వామి జగన్నాథుడే. తిరుపతిలో వరాహ నరసింహస్వామిని, తదుపరి వేంకటేశ్వరస్వామిని దర్శించినట్లు, ఇక్కడ ముందు జగన్నాథ స్వామిని తదుపరి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తారు.
పెద్దజీయర్ స్వామే.. ఇక్కడ శ్రీరామ క్రతువు!
ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్టించిన 36 అడుగుల అభయాంజనేయస్వామి, 30 అడుగుల గరుత్మంతుడు దర్శనమిస్తారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి యావద్భారతదేశం తిరుగుతూ శ్రీరాముడు సంచరించిన ప్రాంతాలలో శ్రీరామ క్రతువు నిర్వహించారు. ఆ క్రతువు విజయ చిహ్నంగా 108 శ్రీరామ క్రతువు స్థూపాల ను ప్రతిష్ఠించారు.
వారు భద్రాచలంలో 100వ శ్రీరామ క్రతువును నిర్వహించి, మార్గమధ్యంలో ఉన్న ఈ క్షేత్ర ప్రశస్త్యాన్ని తెలుసుకుని ఇక్కడ పునర్వసు దీక్షతో 27 రోజులపాటు శ్రీరామమహా క్రతువును నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ 102వ స్థూపాన్ని 13.5.1968న ప్రతిష్ఠిచారు. కోరిన కోరికలు తీర్చడంతో భక్తులకు కొంగుబంగారంగా అనంతాద్రి వెంకటేశ్వర స్వామి నిలుస్తున్నారు. అనంతాద్రిని దర్శించుకునేందుకు హైదరాబాద్, విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి మహబూబాబాద్ వరకు రైలు, బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు.