06-08-2025 11:28:18 PM
వరుసగా ఏసీబీ దాడులకు చెబుతున్న అధికారులు..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): వరుసగా అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నప్పటికీ కొంతమంది అధికారులలో అస్సలు చలనం రావడం లేదు. లంచం తీసుకుంటూ ఇరిగేషన్ సబ్ డివిజన్ -1 అధికారి బుధవారం ఏసీబీ(ACB) అధికారులకు చిక్కాడు. ఒక వ్యక్తికి సంబంధించిన150 గజాల ఒక స్థలానికి సంబంధించి వివిధ శాఖల ఎన్ఓసీ పొందేందుకు వీలుగా అవసరమైన అనుమతి పత్రాల కోసం ఆ స్థలం యజమాని ఇరిగేషన్ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్(Irrigation AE Mohammed Fayaz) పని చెయ్యకుండా అది లేదు ఇది లేదు అంటూ కాలయాపన చేసినట్లు తెలుస్తుంది. దీనితో యజమాని సంప్రదింపులు జరుపగా ఏఈ రూ.5 వేలు డిమాండ్ చేశారు. చిట్టచివరికి పలుమార్లు చర్చలు అనంతరం రూ.3 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత ఆ స్థలం యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యజమాని కి అవసరమైన సలహాలు సూచనలు చేసి ఒప్పందం మేరకు రూ 3000 ఇచ్చి సదరు అధికారి దగ్గరికి పంపించారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరీ లో ఇంటి స్థల యజమాని నుండి ఏ ఈ రూ 3వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి బూత్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ బాలసుబ్రమణ్యం ఏసీబీకి రూ 4 వేలు తీసుకుంటూ చిక్కిన విషయం అందరికీ వివిధమే. వరుసగా ఏసిబి అధికారులకు అవినీతి అధికారులు చిక్కుతున్నప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం ఎలాంటి చలనం రాకపోవడం గమనార్హం.