05-04-2025 04:54:24 PM
మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..
సీఐటీయు రాష్ట్ర కోశాధికారి రాములు..
మంచిర్యాల (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ సిఐటియు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సిఐటియు జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కులను కాలరాస్తు, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మికులను శ్రమదోపిడి గురిచేసి, పెట్టుబడిదారులకు పెట్టేందుకు ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్ లు దేశంలో అమలు జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
కూలీలు కనీస వేతనం అడిగే హక్కులు ఉండనీయకుండా, హక్కుల కోసం సమ్మె చేసే పరిస్థితి కూడా ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగామే 20 న తలపెట్టనున్న సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి రాములు పిలుపునిచ్చారు. కార్మిక వర్గం, ప్రజానికం, యువత, మేధావులు, సామాజిక సంఘాల నాయకులు ఆలోచించి పని ప్రాంతాల వద్ద, బస్తీలలో, గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో, మండల, జిల్లా కేంద్రాలలో సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా సహాయ కార్యదర్శులు దూలం శ్రీనివాస్, భానుమతి, జిల్లా కమిటీ సభ్యులు సమ్మక్క శోభ తదితరులు పాల్గొన్నారు.