15-05-2025 08:11:15 PM
ఐటీడీఏ పిఓ రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): 2025-26 విద్యాసంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మొత్తం 08 (భద్రాద్రి కొత్తగూడెం-07, ఖమ్మం 01) తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునకు కేంద్ర సిలబస్(CBSE)లో ఎంపీసీ, బైపిసి సీఈసీ హ్యూమన్యుటీస్ గ్రూపులలో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు పిఓ రాహుల్(ITDA PO Rahul) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25వ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికల నుండి ఈనెల 16 నుండి 24వ తేదీ వరకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
ఆసక్తిగల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈఎంఆర్ఎస్ విద్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈఎంఆర్ఎస్ గండుగులపల్లి, గుండాల బాలికలకు ఎంపీసీ, సీఈసీ గ్రూపులకు, ఈఎంఆర్ఎస్ పాల్వంచ బాలికలు ఎంపీసీ, బైపిసి, సీఈసీ గ్రూపులకు, ఈఎంఆర్ఎస్ టేకులపల్లి బాలురు బైపీసీ, సీఈసీ గ్రూపులకు, ఈఎంఆర్ఎస్ దుమ్మగూడెం బాలురు, బాలికలు ఎంపీసీ, బైపీసీ, హ్యూమనిటీస్(Humanities) గ్రూపులకు, ఈఎంఆర్ఎస్ చర్ల, ములకలపల్లి, సింగరేణి బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సిఇసి గ్రూపులలో ఖాళీలు ఉన్నాయి అన్నారు.
దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థిని, అభ్యర్థులకు ఎంపిక 10వ తరగతిలో సిజిపిఏ/సిబిఎస్సి(CGPA/CBSE) మెరిట్ మార్పుల ఆధారంగా కౌన్సిలింగ్లో వారికి అడ్మిషన్ ఇవ్వబడునని, అట్టి కౌన్సిలింగ్ ఈనెల 26న ఉదయం 9 గంటలకు ఈఎంఆర్ఎస్ చర్ల@భద్రాచలం నందు నిర్వహించబడునని అన్నారు. కావున గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.