15-05-2025 10:57:05 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలోని చింతలచెరువు కట్టపై గల కాకతీయుల కాలం నాటి ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుంచి ఆత్మలింగేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి ఆలయంలో మంగళ వాయిద్యాలచే స్వస్తివాచనము, గోపూజ, విగ్నేశ్వర పూజ, మాతృకారాధన, దేవనాంది, పంచగవ్య విధి, రక్షాబంధనం, ఆచర్యాది రుత్విక్ వర్ధనము, యాగశాల ప్రవేశము నిర్వహించారు.
సాయంత్రం యజ్ఞశాల సంస్కారము, అఖండ దీప ప్రజ్వలన, అంకురారోపణము, యోగిని, వాస్తు క్షేత్రపాలక, బ్రహ్మాది మండల దేవతా స్థాపనములు, అగ్నిప్రతిష్ట, నవగ్రహ ఆరాధన, ప్రధాన దేవత మంత్ర హవనములు, పంచగవ్యాధి వాసము, హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఈ పూజలకు విజయవాడ నుంచి 15 మంది రుత్వికులు తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాస రావు నేతృత్వంలో నిర్వహించిన పూజల్లో ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.