03-09-2025 07:54:02 PM
గద్వాల: ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ హై టెక్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జీపీఓలకు నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్(Revenue Department Secretary Lokesh Kumar) తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి జిపిఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేయాల్సిన ఏర్పాట్లు పై అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీపీఓ పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించి హైదరాబాద్ వెళ్లేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ వీడియో కఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఏఓ భూపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.