01-06-2025 12:42:30 AM
ఆపరేషన్ సిందూర్ విజయంపై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి శరాఘాతంలా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. సైన్యం విజయాలను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయ జెండాలు చేతబట్టి తిరంగా ర్యాలీలు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ రివర్స్ కొడుతున్నాయా అనే డౌటానుమానాలు అందరికీ వస్తున్నాయి.
ఎన్ని రాఫెల్ యుద్ధవిమానాలు కూలిపోయాయో ప్రధాని ఎందుకు చెప్పడం లేదంటూ కాంగ్రెస్ నేతలు నిలదీసే ప్ర యత్నం చేసినా అది సరైన విధానం కాదనేది పలువురు భావిస్తున్నారు. వాస్తవంగా యుద్ధం జరిగినప్పుడు ఏ దేశం కూడా తాను ఎంతమేర సైన్యాన్ని కోల్పోయిందో, యుద్ధవిమానాలను, హెలిక్యాప్టర్లను ఏ మేరకు నష్టపోయిందో చెప్పుకునే పరిస్థితి ఉండదు.
అలా చేస్తే ఎదుటిపక్షం మానసికంగా పైచేయి సాధించినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నేతలు మాత్రం రాఫెల్ యుద్ధవిమానాలు కూలాయనే అంశాన్ని ప్రధానంగా ఎంచుకునడం దేశ ప్రజలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎన్ని విమానాలు కూలాయనేది మ్యాటర్ కాదు..మనం పైచేయి సాధించామనేది మ్యాటర్ అనే చిన్న లాజిక్ కాంగ్రెస్ నేతలు మర్చిపోయినట్లున్నారని విశ్లేషకులు అంటున్నారు. విజయభాస్కర్