13-01-2026 02:03:26 AM
హైదరాబాద్, జనవరి 12(విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తమ ఆటపాటలతో ఊరూర ధూంధాం నిర్వహించి తెలంగాణ భావజాలాన్ని పల్లె పల్లెకు తీసుకువెళ్లిన కళాకారులకు తక్షణమే తెలంగాణ సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సం ఘం ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించనున్న చలో హైదరాబాద్, కళాకారుల పోరు దీక్ష వాల్ పోస్టర్ను తెలంగాణ ఉద్యమ కళాకారులతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కేవలం కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతోనే పల్లె పల్లెకు విస్తరించిందన్నారు.
కళాకా రుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కళాకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో వందలాదిమంది కళాకారుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. గత ప్రభుత్వం లో కళాకారులకు అన్యాయం జరిగిందని కాం గ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతాదని ఆశించిన కళాకారులకు నేడు నిరాశే మిగిలిందన్నారు. కళాకారులకు తెలంగాణ సారధిలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్ర భుత్వంపైన ఉన్నప్పటికీ తన బాధ్యతను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్రెడి,్డ మంత్రి జూపల్లి కృష్ణారావులో తక్షణమే జోక్యం చేసుకొని నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్య మ కళాకారుల సంఘం వ్యవస్థాపకుడు అనుమోజు వెంకటేశం మాట్లాడుతూ కళాకారుల హక్కుల కోసం ఈనెల 20న ఉదయం ౧౦ గం టలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కళాకారుల ఊరు పోరు దీక్ష చేపట్టామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ కళాకారులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జువాజి ప్రవీణ్, కొండ్ర కుమార్, హైమత్, పి రమేష్, కొత్త నరసింహస్వామి, గూడూరు భాస్కర్, బండి గారు రాజు, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.