20-08-2025 01:45:56 AM
జువాలజీలో పరిశోధనలకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రదానం
ఎల్బీనగర్: ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ జంతుశాస్త్ర విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జిలకర స్వామి ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. జంతుశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ జి. సునీతాదేవి పర్యవేక్షణలో ‘ఎఫెక్ట్ ఆఫ్ సోమాటోట్రోపిన్ ఆన్ గ్రోత్ ఫుడ్ కన్వర్షన్ ఎఫిషి యన్సీ అండ్ బయోకెమికల్ ఆల్టరేషన్స్ ఆఫ్ ఫిష్ కట్ల కట్ల’ అను అంశంపై ఆయన పరిశోధనలు చేసి సమర్పించిన థీసిస్ కి గాను ఓయూ – 2024 లో డాక్టరేట్ ను ప్రకటించింది.
మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన కాన్వకేషన్ డే కార్యక్రమంలో ఓయూ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్, ఓయూ వైస్ చాన్స్లర్ కుమార్ మొగుళం చేతుల మీదుగా స్వామి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రాజేంద్ర కుమార్, సహచర ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ స్వామికి అభినందనలు తెలిపారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ... స్వామి డాక్టరేట్ అందుకోవడం సంతోషదాయక విషయమని, తమ కళాశాల అధ్యాపకుడు పరిశోధనలో రాణించడం, ఆ ఫలితాలు విద్యార్థుల పరిశోధనలు, జిజ్ఞాస ప్రాజెక్టులలో ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన స్వామి ఎమ్మెస్సీ, బీఈడీ ఓయూలోనే పూర్తి చేశారు. అనంతరం అధ్యాపక వృత్తిని ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. డాక్టర్ స్వామి జవాలజీలో రాసిన రీసెర్చ్పేపర్లు పలు, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమవ్వడం విశేషం.